ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో ప్రచురితమైన కార్టూన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాఠ్యపుస్తకాల్లో కార్టూన్ల వినియోగంపై సమీక్ష జరపాలని మాజీ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా నేతృత్వంలోని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదిస్తూ, పాఠ్యపుస్తకాలు చిన్నారులపై ప్రభావం చూపే సాధనమని, అందులో వ్యంగ్య కార్టూన్లు ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
ఈ అంశం క్లాస్ 8 సామాజిక శాస్త్ర పుస్తకంలో న్యాయవ్యవస్థపై వచ్చిన వివాదంతో వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల మానసిక స్థితిపై వ్యంగ్య చిత్రాలు ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్రం కోర్టుకు తెలిపింది. అయితే గతంలో సుప్రీంకోర్టు వ్యంగ్యం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని వ్యాఖ్యానించిన సంగతి గుర్తుచేశారు న్యాయ నిపుణులు.
ఈ కమిటీ పాఠ్యాంశాల్లోని కార్టూన్లు విద్యార్థులకు అనుకూలమా కాదా అనే అంశాన్ని పరిశీలించనుంది. విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాల రూపకల్పనపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో విద్యార్థుల వయస్సు, అవగాహన స్థాయిని దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు.
Category


