రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి గురువారం కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రి కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేకంగా కోరుకున్నామని చెప్పారు.రాష్ట్రంలో ధార్మిక చైతన్యం పెంపొందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తిరుమల శ్రీవారి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన పర్యటనను ముగించారు.


