మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో వైద్యుల సూచనలు
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి)
భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా బాలికల ఆరోగ్య రక్షణ కోసం హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తున్నట్లు యూపీహెచ్సీ ఆత్మకూరు ఇన్చార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ మష్కూర్ అహ్మద్ తెలిపారు.
మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 01-03-2011 నుండి 01-03-2012 మధ్యకాలంలో జన్మించిన బాలికలకు ఈ విలువైన వ్యాక్సిన్ను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తోందన్నారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు.గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంత ప్రజలకు అవగాహన ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ వేయించుకోవడంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోందని డాక్టర్ మష్కూర్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.హెచ్పీవీ వ్యాక్సిన్పై కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా సందేహాలు ఉంటే మరో వైద్యుడి వద్ద సెకండ్ ఒపీనియన్ తీసుకొని అయినా సరే పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.ప్రభుత్వం నిర్దేశించిన తేదీల మధ్యలో జన్మించిన బాలికలకు మాత్రమే ఆన్లైన్ నమోదు ప్రకారం వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. గడువు పూర్తయిన తరువాత వచ్చిన వారికి వ్యాక్సిన్ వేయడం సాధ్యం కాదని, ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం మాత్రమే టీకా నమోదు చేసి వేయాల్సి ఉంటుందని వివరించారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో భారీ ఖర్చుతో లభించే ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, ఇది పూర్తిగా సురక్షితమైనదని వైద్య అధికారులు తెలిపారు. ప్రతి అర్హత కలిగిన బాలికకు టీకా వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని డాక్టర్ మష్కూర్ పేర్కొన్నారు.


