విశాఖపట్నం మార్చి పున్నమి ప్రతినిధి)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం నగరంలో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్డులో కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీ చేపట్టి మహిళల భద్రతపై స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ లతా మాధురి, పలువురు ఎస్ఐలు, సచివాలయ మహిళా పోలీసులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మహిళలపై వేధింపులు, దాడులు వంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మహిళలను వేధించినా, దాడులు చేసినా జీవితాంతం శిక్ష తప్పదనే సందేశాన్ని ప్లకార్డుల ద్వారా ప్రదర్శించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత సమాచారం పంచుకోవడంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలియజేశారు. మహిళల భద్రతే పోలీసుల ప్రాధాన్యమని, ప్రతి మహిళ భయభ్రాంతులకు గురికాకుండా జీవించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.



