ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లను కోల్పోయిన బాధితులను పరామర్శించిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చలగాటం ఆడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచే ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. జిల్లాలో కీలక పదవులు కాంగ్రెస్ చేతుల్లోనే ఉన్నప్పటికీ, ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశలు మూడు సంవత్సరాలకే చెదిరిపోయాయని అన్నారు.
హైదరాబాద్లో హైడ్రా, మూసీ పేరుతో ఒకచోట కూల్చివేతలు చేస్తూ, వెలుగుమట్లలో భూదాన్ భూములు, అక్రమ గుడిసెలు అంటూ పేదల నివాసాలను నేలమట్టం చేశారని మండిపడ్డారు.
భూదాన్ అంటే దానం చేసిన భూమి అని గుర్తు చేసిన ఆయన, సామాజిక సంస్కర్త వినోబా భావే వేల ఎకరాలు దానం చేసిన నేపథ్యంలో వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాలు భూదాన్ భూమి ఉన్నాయని తెలిపారు. గతంలో ఈ భూములపై ఎవరూ ఆసక్తి చూపకపోయినా, ఇప్పుడు భూముల విలువ పెరగడంతో ప్రభుత్వం దృష్టి పడిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం భూములు పంచడం కాదు, లాక్కోవడమే చేస్తోందని విమర్శించారు.
2019లో కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని చెప్పినా, అప్పటి ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఇవ్వకపోగా, ఉన్న నివాసాలనే కూల్చివేసిందని అన్నారు.
పేదలపై 4000 మంది పోలీసులను మోహరించడం అవసరమా అని ప్రశ్నించిన ఆయన, 62 ఎకరాల్లో 30 ఎకరాల భూమి ఎక్కడికి వెళ్లిందో కలెక్టర్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూదాన్, ఇనామ్ భూముల వివరాలను బయటపెట్టాలని, పెద్దల వద్ద ఉన్న అక్రమ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
బాధితులకు అదే స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని, తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జరిగిన తప్పుకు ముఖ్యమంత్రి నిర్బంధంగా క్షమాపణ చెప్పాలని కోరారు.
పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారిపైనే అన్యాయం చేస్తోందని విమర్శించిన ఈటెల రాజేందర్, వెంటనే ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


