విశాఖపట్నం ఫిబ్రవరి ( పున్నమి ప్రతినిధి)
నగరంలోని విశాఖపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో మంగళవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ఆవరణలో ఆర్డీఎక్స్ బాంబు అమర్చినట్లు అజ్ఞాత వ్యక్తి ఈ–మెయిల్ ద్వారా హెచ్చరించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టాయి. విచారణల నిమిత్తం వచ్చిన న్యాయవాదులు, పిటిషనర్లు, సిబ్బందిని బయటకు పంపించి కోర్టు ఆవరణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన సోదాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు. బెదిరింపు మెయిల్ తప్పుడు సమాచారం కావచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



