ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం పరిధిలోని వేగేశ్వరపురం మరియు తాళ్లపూడి,ప్రక్కిలంక గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్లు ప్రస్తుతం వారి ఉపయోగానికి కాకుండా ఇతరుల స్వార్థ ప్రయోజనాలకు వేదికలుగా మారినట్టు స్థానికులు వాపోతున్నారు.
వేగేశ్వరపురం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన కైకాల సూర్యచంద్ర జూనియర్ కాలేజీ సమీపంలోని బస్సు షెల్టర్ ప్రయాణికులు కూర్చునే పరిస్థితిలో లేకుండా మారింది. చుట్టుపక్కల వ్యాపారులు తమ టూ వీలర్ వాహనాలను నిలిపివేసే స్థలంగా దానిని వినియోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే గ్రామంలో కొప్పుల గంగాధర్ సామిల్ వద్ద ఏర్పాటు చేసిన మరో బస్సు షెల్టర్లో కూడా కొంతమంది వ్యక్తులు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
తాళ్లపూడి గ్రామపంచాయతీ సమీపంలోని బస్సు షెల్టర్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రయాణికులు నిలబడేందుకు కూడా వీలు లేకుండా కాగితాలు, గ్లాసులు, ప్లాస్టిక్ బాటిళ్లు తదితర వ్యర్థ పదార్థాలతో నిండిపోయినట్లు కనిపిస్తోంది.
అలాగే ప్రక్కిలంక గ్రామంలో అమరావతి లాడ్జ్ ఎదురుగా, మాజీ ఎంపీటీసీ సొలస నాగ సీతారామ కస్తూరి జ్ఞాపకార్థం వ్యయప్రయాసలతో నిర్మించిన బస్సు షెల్టర్ కూడా ప్రయాణికులకు ఉపయోగపడే స్థితిలో లేదు. పక్కనే ఉన్న టీ, టిఫిన్ హోటల్ యజమానులు వాడిన నీటిని షెల్టర్లోకి వదులుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల అక్కడ దుర్వాసన వ్యాపించి, దోమల పెంపక కేంద్రంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం లేదా దాతలు ప్రయాణికులు ఎండ, వానల నుండి రక్షణ పొందేందుకు నిర్మించిన ఈ బస్సు షెల్టర్లు ప్రైవేట్ వ్యక్తుల అవసరాలకు వాడబడుతుండగా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్సు షెల్టర్లను శుభ్రపరచి, అక్రమ వినియోగాన్ని అరికట్టి, ప్రయాణికుల కోసం వీటిని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.




