*విశాఖ పార్టీ కార్యాలయం లో మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజాదర్బార్*
*ప్రజలు,పార్టీ కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు స్వీకరణ*
*ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ*
*విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి *
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖ 83వ డివిజన్ పరిధిలోని ఏఎంసీ కాలనీలో 192 కుటుంబాలకు రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన అపార్ట్ మెంట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇళ్లు పునర్ నిర్మించి తమను ఆదుకోవాలని కాలనీ వాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్థుల పిల్లల కోసం విశాఖలో కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పాటు తగిన నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని విశాఖ కారుణ్య స్వచ్ఛాంధ్ర సేవా సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముషిడిపల్లిలో యాదవ సామాజికవర్గానికి ఇళ్ల స్థలాలు కేటాయింపుతో పాటు కమ్యూనిటీ భవనం నిర్మించాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విశాఖ మద్దిలపాలెం కేఆర్ఎమ్ కాలనీకి చెందిన వెంపాడ స్తుతయ్య విజ్ఞప్తి చేశారు. వారసత్వంగా సంక్రమించిన భూమి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేయగా వీఆర్వో తిరస్కరించారని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం, రామయోగి అగ్రహారానికి చెందిన నాగిరెడ్డి గొంగలయ్య కోరారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.


