పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతి నిధి)
సూర్యాపేట జిల్లాలోని కోదాడలో దళిత యువకుడి లాకప్ డెత్ కలకలం రేపుతోంది. కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన కర్ల రాజేష్ (30) అనే యువకుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కాజేయబడిన విషయంపై న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా, అదే ఫిర్యాదు అతని ప్రాణాలకు కారణమైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తెలుసుకున్న వివరాల ప్రకారం, రాజేష్ పేరు మీద విడుదలైన రూ.1 లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కును దొండపాడు ప్రాంతానికి చెందిన చెడపంగు నరేష్ అనే వ్యక్తి దుర్వినియోగం చేసినట్టు బయటపడింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన రాజేష్ను కస్టడీలోకి తీసుకున్న కోడాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసినట్టు కుటుంబ సభ్యుల ఆరోపణ.
తీవ్ర గాయాలతో ఉన్న రాజేష్ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండు నిమిత్తం హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించగా, అక్కడ ఆయన శ్వాస సమస్యతో ఇబ్బంది పడటాన్ని గమనించిన జైలు అధికారులు తిరిగి పోలీసులకే అప్పగించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ తరలించాలని సూచించారు. అయితే మార్గమధ్యంలోనే రాజేష్ మృతి చెందాడు.
తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన రాజేష్ను కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రాకుండా కోదాడ డీఎస్పీ ప్రయత్నిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తుండగా, రాజేష్ కుటుంబం న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘాలు, దళిత సంఘాలకు విజ్ఞప్తి చేశారు.


