*
*దీర్ఘకాలిక పెండింగ్ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడమే నా ధ్యేయం*
*NH 165 దిగమర్రు- ఆకివీడు వయా భీమవరం బైపాస్ 3200 కోట్లతో డిపిఆర్ సిద్ధం*
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఈ నెలలోనే అందుబాటులోకి రానున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు వర్మ ప్రకటించారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త రైళ్లను తీసుకురావడానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఈ ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయించడంలో కీలక ప్రగతి సాధించానని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉన్న మూడు వందే భారత్ రైళ్లకు అదనంగా, నర్సాపురం-చెన్నై వందే భారత్ రైలు త్వరలో ప్రారంభం కానుందని శ్రీనివాస వర్మ తెలిపారు. గత పది నెలలుగా నిరంతర సమీక్షల తర్వాత రైల్వే శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నై-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నర్సాపురం వరకు పొడిగించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ రైలు విజయవాడ, భీమవరం, గుడివాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో మాత్రమే ఆగి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినందున, త్వరలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైలు ప్రారంభ తేదీని ప్రకటిస్తారని తెలిపారు. ఈ రైలు సాధించటం పశ్చిమ గోదావరి ప్రజలకు గర్వకారణమని, దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలులో ప్రయాణించే అవకాశం జిల్లా వాసులు లభించిందని అన్నారు. నర్సాపురం వందే భారత్ ఆక్వా వాణిజ్యానికి మరింత ఊతమిస్తుందని, ఆక్వా రైతులు, వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాల కోసం నెల్లూరు, చెన్నైకి తక్కువ సమయంలో చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ రైలు సాధించడం కోసం తాను పలుమార్లు రైల్వే శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేశానని వర్మ చెప్పారు. ఇప్పటికే అరుణాచలంకు కొత్త స్పెషల్ ట్రైన్, అత్తిలిలో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్లు సాధించామన్నారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిచిన అరుణాచలం రైలు సర్వీస్కు మంచి స్పందన లభించడంతో, ఈ రైలును రెగ్యులర్ చేయడానికి అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. విశాఖపట్నం- హైదరాబాద్ వందే భారత్ కు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో హాల్ట్ కల్పించేందుకు తాను చేసిన విజ్ఞప్తికి అధికారులు అంగీకారం తెలిపారని అన్నారు. త్వరలోనే ఆ ప్రకటన కూడా వస్తుందన్నారు
సికింద్రాబాద్-మైసూర్-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఇకపై నర్సాపురం-మైసూర్-నర్సాపురం ప్రత్యేక రైలుగా నడుపుతారని, ఈ రైలు సికింద్రాబాద్ మీదుగా వెళ్తుందని తెలిపారు. ఇది హైదరాబాద్కు ప్రయాణించే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
*రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ*
అమృత్ భారత్ పథకం కింద నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వందల కోట్ల రూపాయలతో జరుగుతున్నాయని శ్రీనివాస వర్మ తెలిపారు. ఇటీవల తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఆధునికరణకు అదనంగా రూ. 18 కోట్లు, గూడ్స్ గోడౌన్ రోడ్డు మార్గానికి రూ. 8 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని శ్రీనివాస వర్మ చెప్పారు.
గత 15 సంవత్సరాలుగా కోర్టు కేసులు, రైతులు సహకరించకపోవడం వల్ల పెండింగ్లో ఉన్న దిగమర్రు- ఆకివీడు జాతీయ రహదారి 165 రెండో ప్యాకేజీ పనులు ప్రారంభించేలా కేంద్రమంత్రి అయిన వెంటనే చర్యలు తీసుకున్నానని, గతంలో 800 కోట్లతో రెండు లైన్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఎలైన్మెంట్ మార్చి జాతీయ రహదారుల అధికారులతో సర్వే చేయించి కొత్త ఎలైన్మెంట్ తో 2400 కోట్ల రూపాయలు అంచనా తో నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి అనుమతి సాధించామని అయితే ఎస్ ఎస్ ఆర్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం వల్ల అంచనాలు 3200 కోట్ల రూపాయలు అయిందన్నారు. అయినప్పటికీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 3200 కోట్ల రూపాయలతో ఎన్.హెచ్ 165 నిర్మాణానికి అంగీకారం తెలిపారని, నూతన డిపిఆర్ కు కేంద్ర క్యాబినెట్ అనుమతి సాధించి పనులు ప్రారంభించబోతున్నామన్నారు.
భీమవరం అంబేద్కర్ సెంటర్ వద్ద నుండి 2.8 కిలోమీటర్లు విశాలమైన బైపాస్ ప్రధాన రోడ్డు నిర్మాణం కూడా ఇందులో భాగంగా నిర్మిస్తున్నామని అన్నారు. లోసరి- పిప్పర రహదారి నిర్మాణానికి సి ఆర్ ఐ ఎఫ్ నిధుల ద్వారా 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని కోర్టు కేసుల వల్ల ఆలస్యమైందని రెండు నెలల్లోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారని తెలిపారు.


