సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @
జ్యోతివెలిగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. చిత్రంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, మంత్రి గీతాజీవన్ తదితరులు
రోజు కూలీలనూ బ్యాంకు సేవల పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. చెన్నైలో మంగళవారం జరిగిన సిటీ యూనియన్ బ్యాంకు 120వ వ్యవస్థాపక వేడుకలను రాష్ట్రపతి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి బ్యాంకింగ్ రంగం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
సకాలంలో రుణాలు అందించి వ్యవసాయం రంగం లాభదాయకంగా ఉండేందుకు దోహదపడాలని తెలిపారు. అంకుర సంస్థల నుంచి స్మార్ట్సిటీల వరకు పలు మార్గాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు బ్యాంకులు సహకరించవచ్చని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.8 శాతానికి పెరిగిందన్నారు. ప్రైవేటు బ్యాంకుల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు.


