రైల్వే కోడూరులో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు వైపు మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే పథకం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఘనంగా ప్రారంభమైంది.
రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ & రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన “తెలుగింటి ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం” పథకం మహిళల ఆర్థిక భారం తగ్గించడమే కాక, వారి స్వేచ్ఛాయుత రవాణా హక్కును బలోపేతం చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ప్రారంభోత్సవంలో ముక్కా రూపానంద రెడ్డి, అరవ శ్రీధర్ గారు స్వయంగా మొదటి టికెట్ అందించి ఆడపడుచులతో బస్సులో ప్రయాణించారు. ప్రాంతమంతా “జై కూటమి” నినాదాలతో మారుమోగింది.
ముక్కా రూపానంద రెడ్డి గారు మాట్లాడుతూ – “ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మహిళలు లాభపడతారు. కూటమి ఎల్లప్పుడూ ఆంధ్ర ఆడపడుచుల అభ్యున్నతికి కట్టుబడి ఉంటుంది. ఈ రోజు మహిళల ముఖంలో కనిపించిన ఆనందమే మా నిజమైన విజయానికి నిదర్శనం” అన్నారు.
అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం, రైల్వే కోడూరు అభివృద్ధి పథంలో దూసుకుపోవడమే మా లక్ష్యం. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే మా ధ్యేయం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, ప్రజలు, మహిళలు, అభిమానులు విస్తృతంగా పాల్గొన్నారు.


