ఖమ్మం, ఆగస్టు
(పున్నమి న్యూస్ ప్రతి నిధి)
: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువకుడు గడ్డం వేణు కుమార్ ఆత్మహత్యాయత్నం ఘటన నేపథ్యంలో మంగళవారం ఖమ్మంలోని ప్రశాంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తదితర నాయకులు పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సరూర్నగర్ యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన హామీల మేరకు 45 రోజుల్లో స్పష్టమైన కార్యాచరణతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. గడువులోగా స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
వేణు కుమార్ ఎన్నో సంవత్సరాలుగా పోటీ పరీక్షల కోసం కష్టపడి చదివినా నోటిఫికేషన్లు లేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా అతడిని తీవ్ర నిరాశకు నెట్టాయని తెలిపారు. అయితే సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, యువత బతికి ఉండి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనలో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, మేకల నాగేందర్, ఆర్.వి.ఎస్. యాదవ్, శాసనాల సాయిరాం, ప్రతాప్, వాకదాని రామకృష్ణ, నాగరాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.



