అనంతగిరి మండలంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక వరి సాగు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం మండల కమిటీ సభ్యుడు, నీటి సంఘం వైస్చైర్మన్ జేష్ట వెంకటరమణ డిమాండ్ చేశారు.బీంపోలు పంచాయతీ సరియాపల్లి రెవెన్యూ పరిధిలోని తరమణవలస గ్రామంలో రైతులతో కలిసి ఆయన వరి పొలాలను పరిశీలించారు.గ్రామ పరిధిలో సుమారు 150 ఎకరాల్లో 60 మంది రైతులు వరి సాగు చేపట్టారని తెలిపారు. అయితే వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగునీరు అందక వరి ఆకుమడులు ఎండిపో యాయని,దీంతో అనేక పొలాల్లో వరి నాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే వ్యవసాయశాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు.నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించి, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఎల్నినో పరిస్థితులు మరింత బలపడి తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దేశంలో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
సెప్టెంబర్లో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 91 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్లో ఎదురయ్యే పంట నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇప్పటికే నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని వెంకటరమణ కోరారు.



