*వైభవంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం*
ఆగస్టు 23 (కె టి సి పున్నమి ప్రతినిధి)
మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభి సీతారామస్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంను వేద పండితులు మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర మహోత్సవంలో ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు, వేద పారాయణాలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం శ్రీ పట్టాభి సీతారామస్వామి వారి శాంతి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. గ్రామంలోని మహిళల కోలాటం మరియు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశేష భక్త జన సమూహమునకు మూడు రోజులపాటు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమంది భక్తులు భక్తి భావంతో భగవంతుని కృపకు పాత్రులై , తరించారు. భగవంతుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

