చిట్వేల్, అక్టోబర్ 07 : (పున్నమి ప్రతినిధి)
రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ వేడుకల్లో ముందుగా కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.తరువాత జరిగిన సభలో ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ “మహనీయుడు వాల్మీకి మహర్షి రామాయణం అనే అద్భుత కావ్యం రచించిన సాహితీ విగ్రహం. దొంగతనం జీవితం నుండి పరివర్తన పొంది మహర్షిగా మారిన ఆయన జీవన గాథ అందరికీ స్ఫూర్తిదాయకం. కష్టసుఖాలను తట్టుకుని సమాజం కొరకు జీవించడమే నిజమైన మహనీయత్వం” అని పేర్కొన్నారు.తెలుగు ఉపన్యాసకుడు శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ “వాల్మీకి మహర్షి జీవితం విద్యార్థులకు ఒక మార్గదర్శకం. దొంగ నుండి మహర్షి అయ్యిన ఆయన కధ మనందరికీ జీవనపాఠం. నేటి కాలంలో మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పుల నుండి నేర్చుకుని పరిపక్వత సాధించాలి. వాల్మీకి ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి సమాజంలో మంచి మార్పు తీసుకురావాలి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఐక్యూ ఏ సి కో ఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేశారు.


