### రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన నర్సయ్యకు సీపీ సజ్జనార్ అభినందనలు
**హైదరాబాద్:** రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ **జోగుల నర్సయ్య**ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ **సీపీ సజ్జనార్** శుక్రవారం సీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావం, అత్యుత్తమ నిబద్ధతతో పనిచేసే పోలీసు అధికారులకు ఇలాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించడం గర్వకారణమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కీలక కేసుల దర్యాప్తులో అదనపు డీసీపీ నర్సయ్య అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన పతకానికి ఎంపిక కావడం ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కీర్తి ప్రతిష్ఠలను మరింత పెంచారని సీపీ పేర్కొన్నారు. నర్సయ్య సుదీర్ఘ పోలీస్ సేవలు, విధి పట్ల ఆయన చూపిన అంకితభావం ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు.
అదనపు డీసీపీ జోగుల నర్సయ్య 1991లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరి సుమారు 35 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. తన సర్వీసులో పలు కీలక కేసుల దర్యాప్తుతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం గతంలో **ఇండియన్ పోలీస్ మెడల్ (IPM)**తో పాటు పలు ప్రతిష్ఠాత్మక పతకాలను అందించింది.
తాజాగా రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపిక కావడం నర్సయ్య సుదీర్ఘ సేవలకు దక్కిన గౌరవంగా పోలీసు వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

