ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీలోకి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)
ఉత్తరాంధ్రలో టీడీపీ మరింత బలోపేతం: సీఎం చంద్రబాబు
విజయనగరం జిల్లా బ్యూరో /రమణ ,సెప్టెంబర్ 8. (పున్నమి ప్రతినిధి)
జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో చిన్న శ్రీను, సిరమ్మ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి పసుపు కండువాలు కప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ చేరిక కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ సీనియర్ నాయకులు కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ పాల్గొన్నారు. అలాగే విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనితతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై చిన్న శ్రీను, ఆయన కుమార్తె సిరమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం
విజయనగరం జిల్లాలో బలమైన రాజకీయ పట్టున్న మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరడంతో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆయన చేరికతో జిల్లాలో టీడీపీకి రాజకీయంగా మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. రానున్న రోజుల్లో విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి శక్తివంచన లేకుండా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.





