పర్మిషన్ ఫ్లోర్స్ 4……????
మంగళపల్లిలో అక్రమ కట్టడాల జోరు
టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రమత్తులోనా..?
పర్మిషన్ ఒకలా.. కట్టడం మరోలా..!
అధికారులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు.. నిజమెంత?
ఆదిభట్ల, సెప్టెంబర్ 8:
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీ మంగళపల్లిలో భవన నిర్మాణాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణ అనుమతులు తీసుకున్న తర్వాత, క్షేత్రస్థాయిలో మాత్రం అనుమతికి మించి నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
నాలుగు ఫ్లోర్లకు (4) అనుమతి తీసుకుని.. ఐదు నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు మంగళపల్లిలో చర్చనీయాంశంగా మారాయి. అనుమతి పత్రంలో ఉన్న నిర్మాణ వివరాలు ఒకలా.. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న నిర్మాణం మరోలా ఉంటే సంబంధిత అధికారులు వెంటనే తనిఖీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అనుమతి ఎక్కడ? నిర్మాణం ఎక్కడ?
భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాణం అదే ప్లాన్ ప్రకారం జరుగుతోందా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగానిదే. అయితే మంగళపల్లిలో అనుమతికి మించి నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
4కు అనుమతి……
అదనపు అంతస్తు నిర్మాణాన్ని అధికారులు గుర్తించలేదా?
గుర్తించినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?
నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారా?
అన్న ప్రశ్నలకు మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.
అధికారులను ‘మేనేజ్’ చేస్తున్నారనే ఆరోపణలు..!
అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. కొందరు నిర్మాణదారులు అధికారులను ‘మేనేజ్’ చేసుకుంటూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.
అలాగే “ముడుపులు పుట్టాయా?” అంటూ కొందరు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై మున్సిపల్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు సామాన్యులకేనా..?
భవన నిర్మాణ నిబంధనలు ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తించాల్సి ఉండగా, కొందరికి మాత్రం నిబంధనలు వర్తించనట్లుగా పరిస్థితి కనిపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి తీసుకున్న దానికంటే అదనంగా నిర్మాణం జరిగితే అది భవిష్యత్తులో ట్రాఫిక్, పార్కింగ్, అగ్నిమాపక భద్రత, మౌలిక వసతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
మంగళపల్లిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై అనుమతి పత్రాలు వర్సెస్ క్షేత్రస్థాయి నిర్మాణం అనే కోణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, అంతస్తుల సంఖ్య, సెట్బ్యాక్లు, ఇతర నిబంధనలను అధికారులు పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు.
4 పర్మిషన్….
అధికారుల తనిఖీలు ఎక్కడ..? చర్యలు ఎప్పుడు..?
మంగళపల్లి నిర్మాణాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి



