బూర్గంపహాడ్, ఆగస్టు 5: ప్రతి ఏడాది గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి వరదల నుంచి మండలంలోని పలు గ్రామాలను రక్షించేందుకు కరకట్ట (రక్షణ గోడ) నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం తొలి దశలో సుమారు 270 నుంచి 300 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
12 కిలోమీటర్ల మేర కరకట్ట
సంజీవరెడ్డిపాలెం నుంచి బూర్గంపహాడ్ మీదుగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడవున, 17 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మించనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అడుగు భాగంలో సుమారు 180 మీటర్ల వెడల్పు, పైభాగంలో ఐదు మీటర్ల వెడల్పుతో నిర్మాణాన్ని ప్రతిపాదించారు. నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సమీపంలోని పెదవాగు నుంచి సంజీవరెడ్డిపాలెం సమీపంలోని దోమలవాగు వరకు కరకట్ట నిర్మించనున్నారు. దీంతోపాటు మండలంలో వర్షపు నీరు గోదావరిలోకి వెళ్లేలా రెండు పంప్హౌస్లను ఏర్పాటు చేయనున్నారు.
ముంపు కష్టాలకు పరిష్కారం
కరకట్ట నిర్మాణం పూర్తయితే సంజీవరెడ్డిపాలెం, బూర్గంపహాడ్, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాలతో పాటు మండల కేంద్రానికి గోదావరి, కిన్నెరసాని వరదల ముప్పు నుంచి రక్షణ లభించనుంది. ఏటా వరదల సమయంలో పంటలు, ఇళ్లు ముంపునకు గురికావడం, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
వారంలో భూసేకరణ సర్వే: ఈఈ
కరకట్ట నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం భద్రాచలం సబ్కలెక్టర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు నీటిపారుదల శాఖ ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. వారంలోపు భూసేకరణ సర్వే పనులు ప్రారంభిస్తామని, తొలి దశలో సుమారు 270 నుంచి 300 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు వెల్లడించారు.

