బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
పని ఇప్పిస్తానని నమ్మించి మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చోరీ
ఇబ్రహీంపట్నం: పని ఇప్పిస్తానని నమ్మించి మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన ఘటనలో నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గజ్జ విజయ్కుమార్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్కుమార్ రెడ్డి, సీఐ రమేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 20న వనస్థలిపురం ఎన్జీవో కాలనీ కూలీల అడ్డా వద్ద మంగమ్మ అనే మహిళను విజయ్కుమార్ సంప్రదించాడు. మన్నెగూడ సమీపంలో మేస్త్రీ పని ఉందని, మంచి కూలి డబ్బులు ఇస్తానని నమ్మించాడు. అనంతరం ఆమెను తన మోటార్సైకిల్పై ఎక్కించుకుని ఆదిభట్ల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వైపు తీసుకెళ్లాడు.
నిర్మానుష్య ప్రాంతంలోని ఖాళీ స్థలానికి చేరుకున్న అనంతరం అక్కడ పని చేయాలని చెప్పి మహిళను బెదిరించాడు. ఆమె మెడలో ఉన్న సుమారు 12 గ్రాముల బంగారు గొలుసును బలవంతంగా అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన మోటార్సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ ప్రదీప్కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలు అపరిచిత వ్యక్తులు చెప్పే ఉద్యోగ, కూలీ పనుల మాటలను నమ్మి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.



