రూ.38 లక్షల విలువైన చెక్కుల పంపిణీ.
పున్నమి మాచర్ల ప్రతినిధి ఆగస్టు:15
అనారోగ్యంతో బాధపడుతూ వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్థిక భరోసాగా నిలుస్తోందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. వైద్య ఖర్చులను భరించలేని కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
మాచర్ల పట్టణంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని సుమారు 60 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ నగదు చెక్కులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


