పెరుమడ్ల ఆంజనేయ స్వామి ఆలయాన్ని పునఃనిర్మించాలి
పురాతన ఆలయానికి దూరంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలి: భక్తులు
RDO స్పందించకపోవడంపై ఆవేదన.. ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రిని కలుస్తామని వెల్లడి
యాచారం, ఆగస్టు 16: యాచారం మండలం తక్కళ్లపల్లి సాగర్ హై నుంచి మేడిపల్లి మీదుగా ఫ్యూచర్ సిటీ వరకు చేపడుతున్న రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా పెరుమడ్ల హనుమాన్ దేవాలయానికి సంబంధించిన పురాతన గోడలను తొలగించడంపై భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ఆలయానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా కొంత దూరం నుంచి రహదారి నిర్మించాలని వారు కోరుతున్నారు.
ఈ విషయంపై ఇప్పటికే RDOకు వినతిపత్రం అందజేసినప్పటికీ స్పందన రాలేదని భక్తులు తెలిపారు. BC కమిషన్ సభ్యులు ఆచారి సైతం RDOకు ఫోన్ చేసి సమస్యను వివరించినట్లు వారు పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పెరుమడ్ల హనుమాన్ దేవాలయం ఎదురుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆలయానికి సంబంధించిన సమస్యను కూడా అధికారులు పరిష్కరించి, పురాతన దేవాలయాన్ని పునఃనిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆలయ పరిరక్షణతో పాటు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే త్వరలో స్థానిక ఎమ్మెల్యేను, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తామని భక్తులు తెలిపారు.
“మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం. పురాతన ఆలయ పరిరక్షణకు అధికారులు స్పందించాలి” అని భక్తులు కోరుతున్నారు.





