*నాయుడుపేట పోలీసుల చొరవతో మైనర్ బాలిక సురక్షితం*
*అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్న బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు*
*బాలల భద్రతే లక్ష్యం.. మరోసారి అప్రమత్తత చాటిన నాయుడుపేట పోలీసులు*
*సకాలంలో స్పందించి బాలికను రక్షించిన పోలీసు శాఖ*
*అపరిచితుల మాయమాటలు నమ్మవద్దని ప్రజలకు పోలీసుల హెచ్చరిక*
*నాయుడుపేట, జూలై 31 (పున్నమి న్యూస్ దొరవారిసత్రం) మద్దాలి వెంకయ్య*
తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలీసుల అప్రమత్తతతో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్న ఓ మైనర్ బాలిక సురక్షితంగా కుటుంబ సభ్యులకు చేరింది. బాలల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న పోలీసు శాఖ మరోసారి తమ బాధ్యతాయుత విధి నిర్వహణను చాటిచెప్పింది.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు బాలల భద్రత, మహిళల రక్షణ, నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నాయుడుపేట బస్టాండ్ వద్ద రాత్రి ఎన్ఆర్ఓ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ ఒంటరిగా సంచరిస్తున్న సుమారు 15 సంవత్సరాల మైనర్ బాలికను గుర్తించి విచారించారు.
విచారణలో బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం తన అమ్మమ్మ వద్ద ఉంటూ కూలీ పనులు చేస్తున్నట్లు తెలిపింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతని పిలుపు మేరకు అక్కడికి వెళ్లేందుకు బయలుదేరినట్లు వెల్లడించింది. అయితే తాను ప్రయాణిస్తున్న బస్సు శ్రీకాళహస్తి పట్టణంలోకి కాకుండా బైపాస్ మార్గంలో వెళ్తుండటంతో నాయుడుపేట బస్టాండ్ వద్ద దిగినట్లు వివరించింది.
బాలిక పరిస్థితి అనుమానాస్పదంగా ఉండటంతో హెడ్ కానిస్టేబుల్ కృష్ణ ఆమెను వెంటనే నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం డీఎస్పీ ఆదేశాల మేరకు బాలిక తల్లికి సమాచారం అందించి పోలీస్ స్టేషన్కు రప్పించారు. తల్లి సమక్షంలో బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి, అపరిచితుల మాయమాటలు నమ్మడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనంతరం బాలికను క్షేమంగా ఆమె తల్లి సంరక్షణకు అప్పగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులను నమ్మి మైనర్ బాలలు, బాలికలు ఇంటి నుంచి వెళ్లకుండా తగిన అవగాహన కల్పించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితుల్లో బాలలు కనిపించినా లేదా వారికి సహాయం అవసరమని గమనించిన వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల అప్రమత్తత, తల్లిదండ్రుల పర్యవేక్షణ, పోలీసుల సకాల స్పందనతోనే బాలల భద్రతను మరింత సమర్థవంతంగా కాపాడగలమని ఎస్పీ పేర్కొన్నారు.


