ఖమ్మం నగరం లోని శ్రీ జయ శ్లోక (SJS) హైస్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్య పోరాటంపై నిర్వహించిన క్విజ్ విద్యార్థుల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. అలాగే చిన్నారుల ప్రతిభను వెలికితీస్తూ నిర్వహించిన ఆర్ట్ కాంపిటీషన్లో విద్యార్థులు అద్భుతమైన పెయింటింగ్స్ వేసి ఆకట్టుకున్నారు. వీటిని చూసి తల్లిదండ్రులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఆలపించిన దేశభక్తి గీతాలతో పాఠశాల ప్రాంగణం మార్మోగింది.
స్కూల్ కరెస్పాండంట్ షిఫాలీ జగదీష్ శర్మ జెండావందనం అనంతరం విద్యార్థులందరికీ స్టీల్ బాక్స్లను బహూకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం విలువను, దేశం కోసం పూర్వీకులు చేసిన త్యాగాలను ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని అన్నారు. చిన్నప్పటి నుంచే దేశంపై ప్రేమ, బాధ్యతతో జీవిస్తూ దేశ అభివృద్ధికి తాము ఏ విధంగా తోడ్పడగలమో ఆలోచించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రమశిక్షణ కలిగిన బాధ్యతాయుత భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. చివరగా వందేమాతరం నినాదాలతో వేడుకలను ముగించారు.



