తక్కళ్లపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
యాచారం, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తక్కళ్లపల్లి గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రొద్దుటూరి సురేందర్ గుప్త ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ సువర్ణ, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



