*జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’!*
అమరావతి: ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థికసాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల చేరికపై మంత్రి లోకేశ్ ఆరా తీశారు. ప్రవేశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జులై మూడో వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్, జులై మూడో వారంలో మెగా పీటీఎం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

