– జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాజశేఖర్
– చిట్వేలు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం
– విద్యాబోధనతో పాటు ఎన్సీసీ సేవలకు గుర్తింపుగా పురస్కారం
తిరుపతి జిల్లా చిట్వేలు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు, ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని రెడ్డి కల్యాణ మండపంలో ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం.వి. రావు ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు–2026 కార్యక్రమంలో ఈ గౌరవం లభించింది. ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్బీకేఆర్ ఐఎస్టీ డైరెక్టర్ విజయ్కుమార్ రెడ్డి, ప్రముఖ కవి, రచయిత చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి, సత్తివేడు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులం ప్రిన్సిపాల్ నారాయణస్వామి తదితరుల చేతుల మీదుగా రాజశేఖర్ను ప్రశంసాపత్రం, షీల్డ్, గోల్డ్ మెడల్తో సత్కరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అవార్డు తనపై వృత్తిపరమైన బాధ్యతను మరింత పెంచిందని రాజశేఖర్ పేర్కొన్నారు. జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న రాజశేఖర్ను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు అభినందించారు.


