విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి): స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనుల్లో భాగంగా పెద్దిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని పేరుకుపోయిన చెత్తకుప్పలను బుధవారం తొలగించారు.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి. నారాయణమూర్తి సమక్షంలో చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. రహదారి పక్కన చెత్త వేయకుండా ప్రజలు, దుకాణాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు.
గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులు, పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో ఇన్చార్జి రత్నం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


