విశాఖ గాజువాక, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కోటి గాజుల విఘ్నేశ్వరుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. జాతీయ రహదారి పక్కన వాహనాల పార్కింగ్, సర్వీస్ రోడ్లపై రద్దీ కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై GVMC, పోలీస్, రెవెన్యూ, R&B, అగ్నిమాపక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం మండపం వద్ద తనిఖీలు చేపట్టింది. మండపం మూడు వైపులా మూసివేయడం, రహదారి పక్కన పార్కింగ్ చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.
అదేవిధంగా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కొన్ని కమర్షియల్ స్టాళ్లు, వినోద కార్యక్రమాలను అధికారులు గుర్తించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వాటిని తొలగించాలని నిర్వాహకులకు ఆదేశించారు.
అయితే కోటి గాజుల గణపతి దర్శనానికి లేదా మండపం నిర్వహణకు సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. తనిఖీల సమయంలో అధికారులకు సహకరించని నిర్వాహకుల వ్యవహారంపై నివేదిక రూపొందించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.


