కేజీబీవీ టీచర్ల సేవలకు తగిన గుర్తింపు.. వేతన పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించాలి
విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 20:
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థినుల భవిష్యత్తు కోసం ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రజాసంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బొద్దపు బంగార్రాజు అన్నారు. బోధనతో పాటు వసతి గృహాల్లోని బాలికల విద్య, క్రమశిక్షణ, ఆరోగ్యం, భద్రత వంటి అనేక బాధ్యతలను టీచర్లు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లో ఉంటూ విద్యార్థినుల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేజీబీవీ టీచర్ల సేవలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాలని ఆయన కోరారు. పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలను పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత, మెరుగైన సేవా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
“బాలికల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల భవిష్యత్తుకు కూడా భరోసా కల్పించాలి. వారి శ్రమకు తగిన గౌరవం, న్యాయమైన వేతనం అందాలి” అని బంగార్రాజు అన్నారు. కేజీబీవీ టీచర్ల సమస్యలపై ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


