*
భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమైన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి నేటికి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కావలి పట్టణంలో ఎమర్జెన్సీ యోధులను ఘనంగా సన్మానించారు. భారతీయ జనతా పార్టీ కావలి ఒకటో పట్టణ శాఖ ఆధ్వర్యంలో, పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ అధ్యక్షతన ఈ గౌరవ సత్కార కార్యక్రమం నిర్వహించబడింది. నాటి నల్లటి రోజుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, పౌర హక్కుల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడిన స్థానిక యోధులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఆనాటి ఎమర్జెన్సీ కాలంలో చురుగ్గా పాల్గొని, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన స్థానిక పోరాట యోధులు కూరపాటి నారాయణ రెడ్డి,ఎండ్లూరి రంగనాథ్ సింగ్ గార్లను నిర్వాహకులు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి భరతమాత చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు భావోద్వేగానికి లోనవుతూ.. తమ జీవితంలో దేశం కోసం చేసిన ఆ పోరాటం ఎప్పటికీ మరువలేనిదని, ఈ రోజున తమను గుర్తుంచుకొని గౌరవించినందుకు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ దేశ రాజ్యాంగ స్ఫూర్తిని, పౌరుల ప్రాథమిక స్వేచ్ఛను పూర్తిగా హరించివేసిందని గుర్తుచేశారు. నాటి పాలకుల అణచివేతకు, పోలీసుల లాఠీ దెబ్బలకు భయపడకుండా, జైలు శిక్షలను భరిస్తూ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన జాతీయవాదుల త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. నేటి యువతకు నాటి చీకటి రోజులను, ప్రజాస్వామ్యం యొక్క విలువను వివరించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్, జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం, జిల్లా కోశాధికారి సి వి సి సత్యం, ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు పాతపాటి వెంకటరమణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ సిద్ధి జయ ప్రతాప్ రెడ్డి, కో ఆపరేటివ్ సెల్ జిల్లా కన్వీనర్ కునపరెడ్డి శ్రీనివాసులు, జలదంకి ఎంపిటిసి కుట్టుబోయిన మాధవరావు యాదవ్, పట్టణ కార్యదర్శి మట్టా మల్లికార్జున, అన్నంగి సురేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


