కబ్జా భూములపై స్పష్టత వచ్చే వరకు దీక్ష కొనసాగుతుంది
రైతులకు న్యాయం చేస్తాం – తహసీల్దార్ అయ్యప్ప
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సాగుతున్న రైతుల నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యాచారం మండల తహసీల్దార్ అయ్యప్ప దీక్షా శిబిరాన్ని సందర్శించి రైతుల సమస్యలు, డిమాండ్లను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, పరిధికి వెలుపల ఉన్న అంశాలను జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కబ్జాలో ఉన్న భూములపై స్పష్టత కలెక్టర్ పరిధిలోని అంశమని, ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అలాగే నకిలీ రికార్డులు లేదా అక్రమాలను గుర్తించి తొలగించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్ మాట్లాడుతూ, కబ్జాలో ఉన్న భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు రైతులకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్షలను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతుల హక్కుల సాధన కోసం ఉద్యమం కొనసాగుతుందని, బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
దీక్షా శిబిరంలో రైతులు, గ్రామస్థులు, భూముల పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.



