కడపలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు – భగవద్గీత బోధన, అభిషేకాలు, అన్నదానం
పున్నమి ప్రతినిధి, కడప, సెప్టెంబర్ 4:
కడప నగరంలోని వై జంక్షన్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) కడప ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు, మంగళహారతి, దర్శన హారతి, భగవద్గీత బోధన, అభిషేకాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి మంగళహారతి కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 7:30 గంటలకు దర్శన హారతి నిర్వహించారు. 8 గంటలకు భగవద్గీత బోధన కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీకృష్ణుని కీర్తనలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీకృష్ణునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, రాధాకృష్ణులకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాలను మాధవ్ దర్శన్ దాస్, పరమేశ్వర బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వై జంక్షన్ పరిసర ప్రాంతం భక్తి వాతావరణంతో కళకళలాడింది.



