🔴 కొత్త సార్సలా బ్రిడ్జి వద్ద రోడ్డును ధ్వంసం చేస్తున్న ట్రాక్టర్లు..!
🔴 అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం
పున్నమి ప్రతినిధి
కాగజ్నగర్ | ఆగస్టు 5, 2026
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని కొత్త సార్సలా బ్రిడ్జి వద్ద అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా కొనసాగుతుండడంతో రహదారి పూర్తిగా దెబ్బతింటోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
గ్రామస్థుల కథనం ప్రకారం, బ్రిడ్జి మార్గంలో ఏడ్ల బండ్ల ద్వారా ఇసుక రవాణాను అడ్డుకుంటున్న అధికారులు, అదే సమయంలో భారీ ట్రాక్టర్లతో ఇసుక తరలింపును నిర్లక్ష్యంగా అనుమతిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ ట్రాక్టర్ల రాకపోకల కారణంగా రహదారి గుంతలమయంగా మారి, సాధారణ వాహనదారులు, రైతులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి, అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంతో పాటు దెబ్బతిన్న రహదారిని మరమ్మతు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు అందరికీ సమానంగా అమలు చేయాలని, ఒకరికి ఒకలా మరొకరికి మరోలా వ్యవహరించవద్దని వారు కోరుతున్నారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.



