ఏండ్లుగా వెంటాడుతున్న డ్రైనేజీ సమస్య.. మామిళ్లవాడ ప్రజల అవస్థలు
స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థుల ఆరోపణ
రెబ్బెన, జూలై 19: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామంలోని మామిళ్లవాడలో ఏండ్లుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు వీధుల్లోనే నిలిచిపోతుండటంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల పెరుగుదలకు కారణమవుతోందని వారు తెలిపారు.
వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, ఇళ్ల ముందు మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై పలుమార్లు గ్రామ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్థులు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే సమస్య సంవత్సరాలుగా కొనసాగుతోందని వారు విమర్శించారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి మామిళ్లవాడ ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.


