ఖమ్మం జులై
(పున్నమి ప్రతి నిధి )
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సుమారు రూ.12 వేల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం నగరంలోని ఆర్.జె.సి. జోన్ వద్ద ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ ఖమ్మం నగర కార్యదర్శి దీకొండ కార్తీక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న రూ.12 వేల కోట్ల బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి మునగలేటి దీపక్ శర్మ, ఫణీంద్ర, ఈశ్వర్, సంతోష్, దేవేందర్, సందీప్తో పాటు పలువురు ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



