ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర ఆత్మకూరు లక్ష్యంగా మున్సిపాలిటీ ప్రత్యేక కార్యక్రమం
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతమైన వాతావరణంతో తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో “ఆపరేషన్ క్లీన్ – స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలోని జేఆర్పేట ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు, ప్రజల ప్రతినిధులు, మాజీ వార్డు కౌన్సిలర్లు కలిసి పాల్గొని భారీ స్థాయిలో శుభ్రతా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి వీధి చివరలోని వాగాల శ్రీహరి ఇంటి వరకు రహదారిపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. రోడ్ల పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను నిర్మూలించి, కాలనీలో పరిశుభ్రతను మెరుగుపరిచారు. మురుగు కాల్వలను శుభ్రపరిచి నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే దోమల నివారణ చర్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన పట్టణ నిర్మాణం కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని, తడి-పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసి అందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు పరిశుభ్రత అత్యంత కీలకమని కమిషనర్ పేర్కొన్నారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండనీయవద్దని సూచించారు.కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బుట్టల్లో వేయాలని కోరారు. పట్టణాన్ని అందంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన చూపించారు. తమ కాలనీలో శుభ్రతా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని, మున్సిపాలిటీ చేపడుతున్న చర్యలకు సహకరిస్తామని తెలిపారు. మాజీ వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.జేఆర్పేట ప్రాంతంలో నిర్వహించిన ఈ ఆపరేషన్ క్లీన్ కార్యక్రమం ద్వారా కాలనీలో పరిశుభ్రత మెరుగుపడడంతో పాటు ప్రజల్లో కూడా అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో దశలవారీగా ఇలాంటి ప్రత్యేక శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు.చివరగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మున్సిపల్ సిబ్బంది, ప్రజల ప్రతినిధులు, స్థానిక ప్రజలకు కమిషనర్ గంగా ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.


