ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కార్యక్రమాన్ని ప్రారంభించి ‘ఐ సపోర్ట్ ఆర్గాన్ డొనేషన్’ సెల్ఫీ పాయింట్లో ఫొటో దిగడంతో పాటు అవయవదాన అంగీకార పత్రాన్ని పూరించి రెడ్క్రాస్ ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మరణానంతరం అవయవదానం ద్వారా ఎనిమిది మందికి జీవం పోయవచ్చని, ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, రెడ్క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, కార్యవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మందికి పైగా అవయవదానానికి అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.



