వంతెన లేక నరకయాతన.. వాగు దాటించేందుకు గ్రామస్తులే ఆధారం
ప్రాణాలకు ముప్పుగా మారిన రాకపోకలు.. శాశ్వత పరిష్కారం కోరుతున్న ప్రజలు
కేరమెరి, ఆగస్టు 2 (పున్నమి రిపోర్టర్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలం అనార్పల్లి వాగు మరోసారి గ్రామీణ ప్రాంతాల దయనీయ పరిస్థితిని కళ్లకు కట్టింది. వాగుపై వంతెన లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండలంలోని బోరిలాల్గూడ గ్రామానికి చెందిన భూరిబాయి తీవ్ర జ్వరంతో మంచం నుంచి లేవలేని పరిస్థితికి చేరుకుంది. ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడినా, ఉప్పొంగి ప్రవహిస్తున్న అనార్పల్లి వాగు అడ్డంకిగా మారింది. దీంతో ఆమె కుమారుడు, గ్రామస్తుల సహాయంతో భూరిబాయిని భుజాలపై మోసుకుంటూ వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. ఈ హృదయ విదారక దృశ్యాలు స్థానికులను కలచివేశాయి.
గ్రామస్తుల కథనం ప్రకారం, ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, రోగులు, గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందక ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



