స్వాతంత్ర్య దినోత్సవం వేళ కడపలో మద్యం విక్రయాలపై ఆరోపణలు
పున్నమి ప్రతినిధి – కడప
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ, కడప నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మద్యం దుకాణాల వద్ద ‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా షాపులు బంద్’ అంటూ పోస్టర్లు ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో దుకాణాల సిబ్బంది బయట నిలబడి మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
కడపలోని కోటిరెడ్డి సర్కిల్, గోకుల్ లాడ్జి, శివారు ప్రాంతాల సమీపంలోని కొన్ని మద్యం దుకాణాల వద్ద ఈ తరహా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. దుకాణాలు మూసివేసి బయట నుంచి విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించి, సంబంధిత దుకాణాలపై తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.

