కలిగిరి, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 22, 2026:
కలిగిరి మండలం లోని పీ.ఎం.శ్రీ మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్–జ్ఞాన జ్యోతి 120 రోజుల అంగన్వాడీ కార్యకర్తల మండలస్థాయి శిక్షణ కార్యక్రమంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వింజమూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ శ్రీమతి పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛత ప్రాధాన్యతను వివరించి, పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా “మార్పు కోసం మనుషులంతా కదలాలి… మన ఊరు, మన రాష్ట్రం పరిశుభ్రంగా మారాలి” అనే సందేశంతో స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. కూడు, గుడ్డ ఎంత ముఖ్యమో జీవన గమనానికి, స్వచ్ఛత కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. “పరిశుభ్రతే ప్రగతికి తొలిమెట్టు” అని చాటుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని వివరించారు. వీధులు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుందని, స్వచ్ఛత అనేది కేవలం పాలకుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని సూచించారు. మాటల్లో కాకుండా చేతల్లో స్వచ్ఛతను ఆచరించి, స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్–స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అన్నవరపు శ్రీను, సూపర్వైజర్ శ్రీమతి విజయలక్ష్మి, డీఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


