స్థల వివాదంపై ఎస్.టి. కుటుంబం ఆవేదన
కలెక్టర్కు వినతి, సమగ్ర విచారణకు డిమాండ్
కడప నగరానికి చెందిన ఎస్.టి. కులానికి చెందిన బుక్కే సామ్రాట్ నాయక్ కుటుంబం తమ స్థల వివాదంపై న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరింది. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన కుటుంబ సభ్యులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.
గత 45 ఏళ్లుగా తాము అదే ఇంట్లో నివాసం ఉంటున్నామని, 1990 సంవత్సరం నుంచి మున్సిపల్ ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు, నీటి పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. 2023లో తమ పేరిట స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త ఇంటి నిర్మాణం కోసం కార్పొరేషన్ నుంచి ప్లాన్ అనుమతి పొందినప్పటికీ, అనంతరం నిర్మాణ పనులను అధికారులు నిలిపివేశారని ఆరోపించారు.
తమ స్థలంపై మరో వ్యక్తి హక్కులు ఉన్నట్లు పత్రాలు సమర్పించడంతో అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర కార్యాలయానికి పిలిపించారని తెలిపారు. ప్రత్యర్థులు సమర్పించిన డి-ఫామ్ పత్రంలో అనేక తప్పులు ఉన్నాయని, అందులో సుమారు 40 పదాలు తప్పుగా ఉన్నట్లు గుర్తించి ఎస్పీ, జిల్లా రిజిస్ట్రార్, తహసీల్దార్, కమిషనర్ తదితర అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను సమర్పించినప్పటికీ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని, ఈ వ్యవహారంలో అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర తమతో అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. అలాగే ప్రత్యర్థులు సమర్పించిన పత్రాల్లో అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదని వాపోయారు.
ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, తమ ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్, జిల్లా రిజిస్ట్రార్ తదితర అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బుక్కే చంద్రమోహన్ నాయక్, బుక్కే కాంతమ్మ పాల్గొన్నారు.

