ఆత్మకూరు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): సనాతన ధర్మ పరిరక్షణ, ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరులోని చారిత్రక శ్రీ అలగనాథ స్వామి ఆలయంలో రూ.80 లక్షల దేవాదాయ శాఖ నిధులతో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 6,800 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నామని, ఆత్మకూరు నియోజకవర్గంలోని 135 ఆలయాలకు రూ.1.62 కోట్లను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆలయాలు లేని ప్రాంతాల్లో 5,000 భజన మందిరాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని, ఆత్మకూరుకు 110 భజన మందిరాలు మంజూరు చేశామని వెల్లడించారు.
ప్రాచీన ఆలయాలను పురావస్తు నిపుణుల సహకారంతో శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరిస్తామని చెప్పారు. పిల్లల్లో నైతిక విలువలు, సంస్కారం పెంపొందించేందుకు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆత్మకూరులో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆలయాలు కేవలం పూజా స్థలాలు కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రాలని మంత్రి పేర్కొన్నారు.




