సత్తుపల్లి, జూలై
(పున్నమి న్యూస్ )
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కిరాణా మర్చంట్స్ కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు.
రక్తదాన శిబిరానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శిబిరంలో సుమారు 200 మందికి పైగా రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, తలసేమియా బాధితులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే వారికి ఉపయోగపడేలా సేకరించిన రక్తాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్కు అందజేస్తున్నామని చెప్పారు. గతంలో కూడా వెయ్యి మందికి పైగా పాల్గొన్న భారీ రక్తదాన శిబిరాలను నిర్వహించినట్లు గుర్తు చేశారు. ప్రజా నాయకుల జన్మదినాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని, అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం ఢిల్లీలో నీట్ విద్యార్థులు గత 20 రోజులుగా చేపట్టిన ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఇంతకాలంగా నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోకుండా, ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి రాజకీయ డ్రామా చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
చివరగా రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.



