శేషవాహనంపై దివ్య మంగళస్వరూపంలో భక్తులను కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామివారు
ఐదో రోజు బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవంగా శేషవాహన సేవ
నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ సౌమ్యనాథస్వామివారు శేషవాహనంపై దివ్య మంగళస్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు.
ఆదిశేషునిపై కొలువై జగత్పాలకుడైన శ్రీమహావిష్ణువు దివ్యరూపాన్ని ప్రతిబింబించేలా అలంకరించిన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. “గోవింద… గోవింద…” నామస్మరణలు, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ ఆలయ పరిసరాలను భక్తిరసపూరితంగా మార్చింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య కటాక్షాన్ని పొందారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూలై 27వ తేదీ సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.
ఈ వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

