విశాఖ గాజువాక, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతులు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నర్సింగరావు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు గాజువాక పోలీస్ స్టేషన్లో సౌత్ ఏసీపీ శ్రీనివాసరావుకు ఆయన ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. హిందువుల తొలి పండుగైన వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేలా అధికారులు సహకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. గాజువాకలో ఆన్లైన్ ద్వారా 496 దరఖాస్తులు రాగా, 485 మండపాలకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేసిన సీఐ వాసునాయుడిని అభినందించారు.
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, హిందూ సంప్రదాయాలు, సంస్కృతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుటూరు శంకరరావు, బగ్గు ఈశ్వరరావు, కృష్ణారెడ్డి, పృథ్వి, వెంకటరమణ, శ్రీనివాస్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.




