– రైతులకు నాణ్యమైన విద్యుత్.. లో – వోల్టేజీ సమస్యకు చెక్
రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం బలిరెడ్డిపల్లి పంచాయతీలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, రైతులు, కూటమి నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. నూతన సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తే బలిరెడ్డిపల్లి పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని రూపానంద రెడ్డి తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందడంతోపాటు లో – వోల్టేజీ, తరచూ విద్యుత్ అంతరాయాల సమస్యలు తగ్గుతాయన్నారు. నిర్మాణ పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


