ఖమ్మం ఏప్రిల్
(పున్నమి జిల్లా ఇంచార్జి
పువ్వాడ నాగేంద్ర కుమార్ )
విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి సంఘీభావం ప్రకటించింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సోమవారం ఖమ్మం నగరంలోని సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికులకు అండగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు సమాజానికి వెలుగులు పంచేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. అర్ధరాత్రుల్లోనూ, భారీ వర్షాలు, ఉరుములు మెరుపుల మధ్య విద్యుత్ స్తంభాలు ఎక్కి సేవలు అందిస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణాపాయం ఉన్నా వెనకాడకుండా విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు.
ఇప్పటికీ పాత నిబంధనలతో కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని పేర్కొంటూ, తక్షణమే ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ వారి పోరాటానికి అండగా ఉంటుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వాకదాని రామకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



