ఖమ్మం, మే
(పున్నమి జిల్లా ప్రతినిధి )
రైతుల వద్ద ఉన్న ధాన్యాన్నిప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతి నిధి నంబూరి రామలింగే శ్వారావ్ డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు రవి రాథోడ్, జిల్లా కార్యాలయ ఇన్చార్జ్ రవి గౌడ్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నంబూరి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా” బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. దీనిని చూసి తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో వైఫల్యం కారణంగానే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా అవసరమైన సహకారం అందిస్తోందని, అయితే ధాన్యం సేకరణ, మిల్లింగ్, రవాణా వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తుంటే, మంత్రులు మాత్రం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని వ్యాఖ్యానించారు.
గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాలకు ఎగ్జిట్లు మంజూరు కావడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని తెలిపారు. అప్పటి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రి బి.ఎల్. వర్మ చొరవతో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి ఎగ్జిట్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు.
రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.



